శ్రీవారి లడ్డుపై దుష్ప్రచారం: తాడేపల్లిగూడెంలో వైఎస్సార్ సీపీ భారీ నిరసన
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారి లడ్డుపై చేసిన దుష్ప్రచారానికి నిరసనగా పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు.
వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇంచార్జి వడ్డి రఘురామ్ నాయుడు నేతృత్వంలో జరిగిన ఈ నిరసనలో పార్టీ శ్రేణులు భారీగా పాల్గొని పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి శ్రీవారిని వేడుకున్నారు.
ఈ సందర్భంగా వడ్డి రఘురామ్ నాయుడు మాట్లాడుతూ, లడ్డులో కల్తీ లేదని సుప్రీం కోర్టు, సీబీఐ, సిట్ స్పష్టమైన నివేదికలు ఇచ్చినా కూడా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా కూటమి ప్రభుత్వం కావాలనే తప్పుడు ప్రచారం చేసిందని తీవ్రంగా విమర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కలియుగ వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్, లడ్డుపై నిజం బయటపడిన తర్వాత కూడా స్పందించకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు. గతంలో మైలయ్యిందంటూ దేవాలయ మెట్లు కడిగిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు అది అబద్ధమని తేలిన నేపథ్యంలో వెంటనే క్షమాపణ చెప్పాలని వ్యాఖ్యానించారు.
లడ్డులో ఎంత పవిత్రత ఉందో ఈరోజు తేటతెల్లమైందని, జగన్మోహన్ రెడ్డి మీద వేసిన బురదను ఆ వెంకటేశ్వర స్వామి వారే కడిగేశారని వడ్డి రఘురామ్ నాయుడు అన్నారు. హిందువుల మనోభావాలతో చెలగాటం ఆడిన కూటమి నాయకులు చేసిన పాపానికి తగిన మూల్యం తప్పకుండా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
previous post
next post
