డ్వాక్రా యానిమేటర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: సిఐటియు
గణపవరం, ఏప్రిల్ 13 (arnews ):
డ్వాక్రా యానిమేటర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం గణపవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో యానిమేటర్లు పాల్గొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
నిరసన అనంతరం తహసీల్దార్, ఏపీఎం, ఎంపీడీవోలకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ మేడిశెట్టి పెంటారావు, డ్వాక్రా యానిమేటర్ల సంఘం అధ్యక్షురాలు అడ్డగర్ల సుబ్బలక్ష్మి మాట్లాడుతూ యానిమేటర్లు గ్రామ స్థాయిలో మహిళా సంఘాల అభివృద్ధికి కీలకంగా పనిచేస్తున్నప్పటికీ, వారికి తగిన గుర్తింపు, వేతనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కనీస వేతనాలు వెంటనే అమలు చేయాలని, గత రెండేళ్లుగా బకాయిగా ఉన్న స్త్రీనిధి ఇన్సెంటివ్లు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. మొబైల్ సిమ్ కార్డులు ఇచ్చిన తరువాత ఎఫ్ఆర్ఎస్ వ్యవస్థపై పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వాలని, లేకపోతే యానిమేటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
హెచ్ఆర్ పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రమోషన్ అవకాశాలు కల్పించాలని కోరారు. 60 సంవత్సరాలు పూర్తయిన వీవీఓఏలకు నిలిపివేసిన వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మహిళా మార్ట్స్, స్వలంబన, అభయహస్తం పథకాల కింద ఉన్న మొత్తాలను పొదుపు మహిళలకు తిరిగి చెల్లించాలని, పది లక్షల వరకు వడ్డీ రాయితీ కల్పించాలని కోరారు. అదేవిధంగా, డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
అక్రమ తొలగింపులు, రాజకీయ వేధింపులు నిలిపివేయాలని నినాదాలు చేశారు. డ్వాక్రా మహిళల బీమా విధివిధానాలను పారదర్శకంగా వెల్లడించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో చోడదాశి లక్ష్మి, పైళ్ల నలిని, పి. సాయి, జి. లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.
