Gitnews.in Telugu News App | Daily Telugu News Channel In Telangana
ఆంధ్రప్రదేశ్

అనకాపల్లి: అందుకే ‘ఎర్నాకుళం’ రైలులో మంటలు!.. మృతుడు విజయవాడ వాసి

ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌ అగ్నిప్రమాద ఘటనలో ఒకరు మరణించారని.. మిగతా ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నారని అధికారులు ధృవీకరించారు.
అలాగే మంటలు పూర్తిగా అదుపులోకి రావడంతో సహాయక చర్యలు పూర్తైనట్లు ప్రకటించారు.

టాటానగర్‌(జార్ఖండ్‌) నుంచి ఎర్నాకుళం(కేరళ) వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌(18189) రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని ఎలమంచిలి సమీపంలోని పాయింట్‌ వద్ద లోకో పైలట్లు గుర్తించి స్టేషన్‌లో రైలును నిలుపుదల చేశారు. ప్రయాణికులంతా బయటకు దిగి పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈలోపు లోకో పైలట్‌ కాలిపోతున్న బోగీలను రైలు నుంచి వేరు చేశారు. సమాచారం అందుకున్న అనకాపల్లి, ఎలమంచిలి, నక్కపల్లికి చెందిన ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

మంటల్లో ఒకరు సజీవ దహనం కాగా.. మిగతా వారంతా సురక్షితంగా బయటపడ్డారు. బీ1 కోచ్‌లోనే మంటలు చెలరేగినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. అర్ధరాత్రి 3.30గంటలు దాటిన తర్వాత రైల్వే అధికారులు కాలిపోయిన రెండు బోగీలను తొలగించి, ఆయా బోగీల్లోని ప్రయాణికులను మిగతా బోగీల్లో సర్దుబాటు చేసి రైలును పంపించడానికి ఏర్పాట్లు చేశారు.

దుప్పట్ల వల్లే..

ప్రమాద స్థలానికి చేరుకున్న దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌ డీఆర్‌ఎం మోహిత్‌ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ”ప్రమాదం జరిగిన ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌ నాలుగు గంటలు ఆలస్యంగా నడుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి దాటాక 1.30గం. ప్రాంతంలో ప్రమాదం జరిగింది. బీ1 కోచ్‌లో మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నాం. ఆ బోగీలో దుప్పట్లు ఉండడం వల్ల మంటలు శరవేగంగా వ్యాపించాయి. రెండు బోగీలు(బీ1, ఎం2) పూర్తిగా కాలిపోయాయి. ప్రమాద సమయంలో బీ1లో 76 మంది, ఎం2లో 82 మంది ఉన్నారు. ప్రమాదంలో ఒకరు మరణించారు. బీ1 బోగీలో మృతదేహాన్ని గుర్తించాం. ప్రయాణికులను ప్రత్యేక బస్సుల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. బ్రేకులు పట్టేయడం వల్లే మంటలు చెలరేగాయని లోకో పైలట్లు చెబుతున్నారు. కానీ, అధికారిక దృవీకరణ జరగాల్సి ఉంది. ఘటనపై విచారణ జరుగుతోంది” అని అన్నారు.

ఇదిలా ఉంటే.. మృతుడ్ని విజయవాడకు చెందిన చంద్రశేఖర్‌ సుందర్‌(70)గా అధికారులు నిర్ధారించారు. ఈ ఘటన తర్వాత.. చలిలో సుమారు 2వేల మంది ప్రయాణికులు స్టేషన్‌లో పడిగాపులు పడ్డారు. అనకాపల్లి, తుని, విశాఖ స్టేషన్‌లో పలు రైళ్లు నిలిచిపోయాయి. విశాఖ నుంచి విజయవాడ వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పూరి-తిరుపతి, ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స​్‌ప్రెస్‌ జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌, బెంగళూర్‌ హంసఫర్‌ రైళ్లు వీటిల్లో ఉన్నాయి. ప్రయాణికులు ఈ విషయం గమనించాలని రైల్వే అధికారులు కోరుతున్నారు.

మరోవైపు ఘటన స్థలానికి రైల్వే సేఫ్టీ కమిటీ చేరుకుంది. ప్రమాద తీవత్రను సీనియర్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో రెండు ఫోరెన్సిక్‌ బృందాలు ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నాయి. ఫైర్‌ సిబ్బంది మూడు గంటలపాటు శ్రమించి మంటలు అదుపులోకి తీసుకొచ్చారని ఎస్పీ తుహీన్‌ సిన్హా తెలిపారు. దర్యాప్తులో ఎఫ్‌ఎస్‌ఎల్‌ ఆధారాలే కీలకమని పోలీసులు చెబుతున్నారాయన. ”ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలు జరిపి సురక్షితంగా ఉన్నారని నిర్ధారించుకున్నాం. ప్రత్యేక బస్సుల్లో రైల్వే స్టేషన్‌కు తరలించాం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ఎర్నాకులం చేరేలా చూస్తాం” అని తెలిపారు.

Related posts

జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన కామెంట్స్

M HANUMATH PRASAD

వలంటీర్లలా చేయలేం!

M HANUMATH PRASAD

నిబంధనలు అతిక్రమించిన ఏ ఒక్క పోలీసును వదలం

M HANUMATH PRASAD

కాకినాడ’లో కాకరేపిన ‘జ్యోతుల’ మాటల తూటాలు

M HANUMATH PRASAD

జోహార్ సీఎం చంద్రబాబు.. జోహార్ లోకేష్.. ‘గంటా’ కొడుకు పరువు తీశాడుగా..!

M HANUMATH PRASAD

మాచర్ల మున్సిపల్‌ చైర్మన్‌కు షాకిచ్చిన సర్కార్‌.. పదవి నుండి తొలగింపు..

M HANUMATH PRASAD