పశ్చిమగోదావరి జిల్లా గణపవరం
గణపవరం మండలం పిప్పర గ్రామానికి చెందిన శ్రీనిజకు అరుదైన గౌరవం దక్కింది. రేపు జరగనున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్ వద్ద జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో నృత్య ప్రదర్శనకు శ్రీనిజ ఎంపికైనట్లు న్యాయవాది గుడ్ల వెంకటకృష్ణారావు తెలిపారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా – మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, నేషనల్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ వారి నుండి శ్రీనిజకు అధికారిక ఆహ్వానం అందింది. దేశీయ సంప్రదాయ నృత్యాలకు సంబంధించిన కార్యక్రమంలో శ్రీనిజ తన ప్రతిభను ప్రదర్శించనుందని చెప్పారు.
శ్రీనిజ ప్రస్తుతం బెంగుళూరులో బహుళజాతి సాఫ్ట్వేర్ సంస్థ NVIDIA లో ఉద్యోగం చేస్తూ, అదే నగరంలోని రేవా యూనివర్సిటీలో భరతనాట్యం డిప్లమా కోర్సును అభ్యసిస్తోంది. విద్యార్థి దశలోనే అనేక నృత్య ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు పొందిన శ్రీనిజ, కళారంగంలో తనదైన గుర్తింపు సాధించింది.
శ్రీనిజ తల్లిదండ్రులు లక్ష్మీశాంతల వెంకటేష్ గుండుబోయిన దంపతులు సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఆమె తాత గుడ్ల వెంకటకృష్ణారావు న్యాయవాదిగా సేవలందిస్తున్నారు. పిప్పర గ్రామానికి చెందిన యువతికి లభించిన “ఈ గౌరవం స్థానికంగా ఆనందోత్సాహాలకు కారణమైంది.”
