తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 3
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం యాగర్లపల్లి ప్రాంతంలో పచ్చని పొలాల మధ్య కొలువై ఉన్న చేలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి 18వ వార్షికోత్సవాన్ని మంగళవారం భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేయగా, సుమారు 7 వేల మంది భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు.
భాగ్యలక్ష్మి పేట, ముత్యాలమ్మ నగర్ (ముదునూరుపాడు), జట్లపాలెం, పెంటపాడు, పడాల తదితర గ్రామాలకు మధ్యలో సుమారు 250 ఎకరాల పచ్చని వ్యవసాయ భూముల నడుమ ఈ ఆలయం వెలసి ఉంది. శతాబ్ద కాలంగా నిత్య పూజలు అందుకుంటున్న ఈ ఆలయానికి ప్రత్యేకమైన ప్రాచుర్యం ఉంది. అమ్మవారిని దర్శించుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటే కోరికలు నెరవేరుతాయన్న విశ్వాసం స్థానికుల్లో బలంగా ఉంది.
అయితే ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఆలయానికి వెళ్లాలంటే భక్తులు, ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు వాపోతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో పుంత రోడ్డు అధ్వాన్నంగా మారడంతో ఆలయానికి చేరుకోవడం కష్టసాధ్యంగా మారుతుందని తెలిపారు. అంతేకాకుండా ఆలయ ప్రాంగణానికి ఇప్పటికీ సరైన విద్యుత్ సదుపాయం లేకపోవడం బాధాకరమని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముదునూరుపాడు పుంతలోని ముసలమ్మ ఆలయం సమీపం నుంచి నేరుగా ముత్యాలమ్మ ఆలయం వరకు పుంత రోడ్డు అభివృద్ధి చేయాలని, అలాగే ఆలయానికి విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయాలని కోరారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పుంత రోడ్ల అభివృద్ధి జరిగితే ఆలయ అభివృద్ధితో పాటు రైతులకు కూడా ఉత్పత్తుల రవాణాకు మేలు జరుగుతుందని తెలిపారు.
ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు, భక్తులు, రైతులు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమంలో స్వయంగా పాల్గొని భక్తులకు అన్న వితరణ చేశారు.
ఈ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ 18వ వార్డు ముదునూరుపాడు ఇంచార్జ్ బేతిరెడ్డి ఉదయ వెంకట భాస్కర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు బేతిరెడ్డి అమ్మిరెడ్డి, వెలగల నర్సారెడ్డి, మేడపాటి గురెడ్డి, ద్వారంపూడి వేణుగోపాల్ రెడ్డి, ఆకుల సుబ్బయ్య, హనుమంతు కుమార్, వెలగల అవినాష్ రెడ్డి, సత్తి జగదీశ్ రెడ్డి, చల్లా శివతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు, రైతులు పాల్గొన్నారు.
next post
