పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిగా బాధ్యతలు స్వీకరించిన వడ్డి రఘురామ్ నాయుడుకు నియోజకవర్గం నలుమూలల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తల మద్దతు వెల్లువలా కొనసాగుతోంది.
ఈ క్రమంలో పెంటపాడు మండలం నుంచి వైసీపీ నాయకులు భారీ సంఖ్యలో తాడేపల్లిగూడెం చేరుకొని వడ్డి రఘురామ్ నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. పెంటపాడు మండల వైసీపీ అధ్యక్షుడు కైకాల శ్రీనివాస్, మాజీ పట్టణ అధ్యక్షుడు గుండుమోగుల నాగు, మాజీ ఏఎంసీ చైర్మన్ గుండుమోగుల వెంకటరమణతో పాటు ఆకు తీకపాడు గ్రామం నుంచి సుమారు 100 మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శాలువాలు, గజమాలలతో వడ్డి రఘురామ్ను ఘనంగా సత్కరించి తమ మద్దతును ప్రకటించారు.
ఈ సందర్భంగా కైకాల శ్రీనివాస్ మాట్లాడుతూ, తాము ఎప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేశామని తెలిపారు. గతంలో తోట గోపి, కొట్టు సత్యనారాయణ ఇంచార్జీలుగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం వడ్డి రఘురామ్ నాయుడు ఇంచార్జిగా ఉన్నారని, పార్టీ అధినాయకత్వం ఎవరికి బాధ్యతలు అప్పగించినా వారి వెంటే నిలబడతామని స్పష్టం చేశారు. పెంటపాడు మండలం తరపున పార్టీ బలోపేతానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ప్రకటించారు.
అనంతరం వడ్డి రఘురామ్ నాయుడు మాట్లాడుతూ, పార్టీలో ప్రతి కార్యకర్తకూ ఒకే లక్ష్యమని, అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రిగా చూడడమేనని అన్నారు. పార్టీ అధినేత తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తూ నియోజకవర్గంలో వైసీపీ జెండాను మరింత బలంగా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రతి కార్యకర్తే ఇంచార్జి అని, అందరికీ సముచిత స్థానం ఉంటుందని తెలిపారు. పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తలు అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాచర్ల సర్పంచ్ భర్త వాకా సుబ్బారావు, వైసీపీ నాయకులు నిమ్మల పెదకాపు, వేరబత్తుల సత్యనారాయణ, సోమిశెట్టి శ్రీను, గాదె సాయి, చీకటిమిల్లి నాగేష్, చింతాల నాగరాజు, దాసం బూరయ్య, ఆకుల శ్రీను, అలగంజి చిట్టిబాబు, గుండెపు కృష్ణవేణి, బుద్దన చంటి తదితరులు పాల్గొన్నారు.
