దాళ్వా వరి పంటలో అధిక దిగుబడులు – కోతలు ముమ్మరం
గణపవరం, ఏప్రిల్ 21:
గణపవరం మండలంలో దాళ్వా వరి పంట కోతలు వేగంగా కొనసాగుతున్నాయని మండల వ్యవసాయ అధికారి ఆర్.ఎస్. ప్రసాద్ తెలిపారు. మండలంలోని కోమర్రు, ముయ్యరు, ముప్పర్తిపాడు, అప్పన్నపేట, పిప్పర, వల్లూరు, చిలకపాడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో దాళ్వా వరి పంట కింద మొత్తం 14,414 ఎకరాల్లో సాగు జరిగిందని, ప్రస్తుతం కోతలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 2,700 ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయని, మిగిలిన ప్రాంతాల్లో కూడా కోతలు ప్రారంభమయ్యాయని చెప్పారు.
మండలంలో సుమారు 82 కోత యంత్రాలు పనిచేస్తూ వరి కోతలను వేగవంతం చేస్తున్నాయని పేర్కొన్నారు. దిగుబడులు ఆశాజనకంగా ఉండి, ఎకరానికి 55 నుంచి 57 బస్తాల వరకు దిగుబడి వస్తుందని తెలిపారు.
రైతులు తమ ధాన్యాన్ని పూర్తిగా ఆరబెట్టి, రైతు సేవా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు. అలాగే స్థానికంగా ఉన్న రైస్ మిల్లులకు ధాన్యం అమ్మాలని సూచించారు.
పచ్చి ధాన్యం అమ్మకాన్ని నివారించాలని, ప్రస్తుతం ఉన్న అనుకూల వాతావరణ పరిస్థితుల్లో రెండు నుంచి మూడు రోజుల్లో ధాన్యం పూర్తిగా ఆరిపోతుందని, తేమ శాతం సుమారు 17% వరకు తగ్గుతుందని తెలిపారు.
ఏమైనా సమస్యలు ఎదురైతే వెంటనే మండల వ్యవసాయ అధికారి లేదా మండల రెవెన్యూ అధికారిని సంప్రదించాలని రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఎస్కే సిబ్బంది రవీంద్ర, రవితేజ, సన్నీ, హవేల, జాబేజ్, దీనాకుమారి తదితరులు మరియు రైతులు పాల్గొన్నారు.
