కూటమి ప్రభుత్వ పాలన అరాచకంగా మారింది: వడ్డి రఘురామ్ నాయుడు
మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వడ్డి రఘురామ్ నాయుడు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తోందని ఆరోపించారు.
జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను తట్టుకోలేక, అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్సార్ సీపీ నాయకులపై వేధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. కలియుగ దైవాన్ని అవమానించే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సందర్భాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు ఎలాంటి చర్యలకు పాల్పడ్డారా అంటూ ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నివేదికలపైనే ప్రభుత్వానికి నమ్మకం లేదా అని ఆయన ప్రశ్నించారు. లడ్డులో కల్తీ లేదని సిట్ స్పష్టమైన నివేదిక ఇచ్చినా, దానిని అంగీకరించకపోవడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు.
అంబటి రాంబాబు నిజాలు మాట్లాడుతున్నందుకే ఆయన ఇంటిపై దాడి చేయడం హేయమైన చర్యగా వడ్డి రఘురామ్ నాయుడు దుయ్యబట్టారు. ఇటువంటి చర్యలకు ప్రతిచర్య తప్పదని కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
వైఎస్సార్ సీపీ శ్రేణులు తమ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సంయమనం పాటిస్తున్నారని, అది చేతకాక కాదని స్పష్టం చేశారు. అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడని గుర్తు చేస్తూ, రాష్ట్రంలో ఆ వర్గానికి ఇస్తున్న గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు.
రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఇప్పుడు అదే అమలు చేస్తున్నారని ఆరోపిస్తూ, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ గుడ్ బుక్ రాజ్యాంగం గురించే మాట్లాడారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను చూసి ఓర్వలేక దాడులకు పాల్పడుతున్నారని అన్నారు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, కలియుగ దైవం అన్నీ చూస్తున్నాడని, అన్యాయానికి తగిన సమాధానం తప్పకుండా వస్తుందని వడ్డి రఘురామ్ నాయుడు హెచ్చరించారు.
previous post
