తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 6 :
పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 26వ తేదీ ఆదివారం మంగళగిరిలో రాష్ట్రస్థాయి పద్మశాలి మహాసభ నిర్వహించనున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జగ్గారపు శ్రీనివాసరావు తెలిపారు. తాడేపల్లిగూడెం క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
జనవరి 26న మంగళగిరిలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ మహాసభను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్, సవిత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితర ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు.
రాష్ట్రంలో సుమారు రెండు లక్షల మంది పద్మశాలి కులస్తులు ఉన్నప్పటికీ చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం లభించడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పద్మశాలీలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత మూడు పర్యాయాలు పద్మశాలీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కలేదని గుర్తు చేశారు.
గతంలో మంగళగిరి నియోజకవర్గం నుంచి పద్మశాలి వర్గానికి చెందిన అభ్యర్థులు మూడు సార్లు విజయం సాధించారని పేర్కొన్నారు. చట్టసభల్లో కనీసం నాలుగు సీట్లు అయినా కేటాయించాలని కోరారు. దేశ విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు కూడా ఈ మహాసభకు మద్దతు ఇస్తున్నారని తెలిపారు.
ఏప్రిల్ 26న జరగనున్న పద్మశాలి మహాసభ గర్జన కాదు, ఆత్మీయ సమ్మేళనం మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ మహాసభ ఏర్పాట్లపై రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నానని, ఆ పర్యటనను తాడేపల్లిగూడెం నుంచే ప్రారంభించామని చెప్పారు.
ఈ సమావేశంలో పద్మశాలి సేవా సంఘం ప్రధాన కార్యదర్శి బండారు బెనర్జీ బాబు మాట్లాడుతూ, ఏప్రిల్ 26న జరిగే మహాసభను విజయవంతం చేయాలని పద్మశాలి కులస్తులకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో ఉన్న పద్మశాలీలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. వెంకటేశ్వర స్వామి భార్య పద్మావతి పద్మశాలీల ఆడపడుచు అని ఆయన గుర్తు చేశారు.
ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు బత్తుల ప్రసాద్, శీరపు అప్పారావు, అంజిబాబు, వెంకటేశ్వరరావు, రవికిరణ్, ప్రకాశ్, శ్రీరామ్ మూర్తి, నాగమణి శ్వరరావు, అచ్చిబాబు, రాము, గణేష్, పద్మ రామకృష్ణ, ఎన్. శ్రీనివాసరావు, ఏఎంసీ డైరెక్టర్ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
previous post
