పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం సరిపల్లిలో ఇండియన్ డిజిటల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప సభాపతి, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు ముఖ్య అతిథిగా విచ్చేసి కళాశాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఒత్తిడి లేని విద్య ఎంతో అవసరమని తెలిపారు. ప్రకృతి మధ్యలో నిర్మించిన ఈ విద్యాసంస్థ విద్యార్థులకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తుందని పేర్కొన్నారు. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా విద్యార్థులు పాల్గొనేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల ఒత్తిడిని తగ్గించేందుకు ఆహ్లాదకరమైన ఆట స్థలాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
నేటి పోటీ ప్రపంచంలో విజయం సాధించాలంటే సాంకేతిక పరిజ్ఞానం ఎంతో ముఖ్యమని, విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో పట్టు సాధించి ఉన్నత శిఖరాలను చేరాలని ఆకాంక్షించారు. ఈ విద్యాసంస్థ రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెంది రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని కోరుకున్నారు.
విద్యాసంస్థ చైర్మన్ తోట భాస్కర్ రావు మాట్లాడుతూ పేద, మధ్యతరగతి విద్యార్థులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్య అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా కోర్సులు అందిస్తున్నామని చెప్పారు. ఇంగ్లీష్ కమ్యూనికేషన్, స్కిల్ డెవలప్మెంట్, డిజిటల్ విద్యపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని వివరించారు.
డైరెక్టర్ & ప్రిన్సిపల్ గెద్ద వీరప్రసాద్ మాట్లాడుతూ నైపుణ్యం గల ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య అందించడం తమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల ప్రతిభను గుర్తించి, వారికి ఉత్తమ శిక్షణ అందిస్తామని అన్నారు.
ఈ విద్యా సంవత్సరం నుండి జూనియర్ కళాశాల కూడా ప్రారంభిస్తున్నామని, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్ఈసీ కోర్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. నిడమర్రు, గణపవరం, ఉంగుటూరు, ఉండి, పెంటపాడు మండలాల విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు.
కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, రాజకీయ ప్రముఖులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
